ఇంట్లో ఫ్రిజ్ పేలి ఏడుగురికి గాయాలు
ముంబయి, మే30( జనం సాక్షి) : ఓఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. షిరోలీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఉదయం 7:30 సమయంలో రిఫ్రిజిరేటర్ పేలిందనీ.. ఫ్రిజ్ వెనుక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరినట్టు భావిస్తున్నామని తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ మైనర్ బాలిక కూడా ఉన్నారు. క్షతగాత్రులకు ప్రస్తుతం ఓ స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామనీ… ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.