ఇండ్లకు మరమ్మతుల పనిలో మాజీ మంత్రులు

లక్నో(జ‌నం సాక్షి ): ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు తక్షణమే ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరుగురు మాజీ సీఎంలూ ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీచేశారు. తాజా ఆదేశాల నేపథ్యంలో ఇప్పటివరకు ప్రభుత్వ బంగ్లాల్లో నివాసముంటున్న మాజీ సీఎంలకు ఇప్పుడు సొంతిండ్లు గుర్తుకొచ్చాయి. పట్టించుకోకుండా వదిలిపెట్టిన తమ ఇండ్లకు మరమ్మతులు చేయించే పనిలో పడ్డారు మాజీ ముఖ్యమంత్రులు. కేంద్రహోంమంత్రి, యూపీ మాజీ సీఎం రాజ్‌నాథ్ సింగ్ గోమ్తి నగర్‌లోని తన నివాసానికి మరమ్మతులు చేయడంతోపాటు మెరుగులు దిద్దిస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత రాజ్‌నాథ్ కాలిదాస్ మార్గ్ 4లో ఉన్న అధికారనివాసం నుంచి గోమ్తి నగర్‌లోని వ్యక్తిగత నివాసానికి మారునున్నారు. ఇక మిగతా మాజీ సీఎంలు కూడా తమ ఇండ్లను బాగు చేయించుకునే పనిలో పడ్డారు.