ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వర్షాలు

– పిడుగుపాటుతో 33మందికిపైగా మృతి
– భయాందోళన చెందుతున్న ఉత్తరాధి ప్రజలు
రాంచీ, మే28(జ‌నం సాక్షి) : ఉత్తర దేశాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పలు చోట్ల పిడుగులు పడి 33మంది మృతి చెందారు. జార్ఖండ్‌ రాష్ట్రంలో 17మంది మృతిచెందారు. మరో 28 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో సోమవారం రాత్రి పిడుగులు పడి ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. కాన్పూర్‌లో ఇద్దరు, రాయ్‌బరేలీలో మరో ఇద్దరు కూడా పిడుగుపాటుకు మృతిచెందారు. మంగళవారం సైతం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు బుధవారం కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా సోమవారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ప్రైవేట్‌ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్‌ తెలిపింది. కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయని స్కైమెట్‌ పేర్కొనగా మే 29న రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. అయితే నేడు నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది.