ఊనాలో జెండా ఆవిష్కరించిన రోహిత్‌ తల్లి

3 copy

అహ్మదాబాద్‌,ఆగస్టు 15(జనంసాక్షి): హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ వేముల తల్లి రాధిక వేముల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దళితులపై దాడి ఘటనతో ఇటీవల వార్తల్లోకొచ్చిన గుజరాత్‌లోని ఉనా ప్రాంతంలోని ఓ పాఠశాల ప్రాంగణంలో ఆమె మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి కన్నయ్య కుమార్‌ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వందలాది ప్రజలు పాల్గొన్నారు. గో సంరక్షణ పేరుతో ఇటీవల ఉనాలో నలుగురు దళిత యువకులను కట్టేసి తీవ్రంగా కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో గుజరాత్‌లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. రోహిత్‌ తల్లి రాధిక అక్కడికి వెళ్లి నేడు జాతీయపతాకావిష్కరణ చేశారు.