వనజాతరకు వేళాయే..
` జనవరి 28 నుండి 31వరు మేడారం జాతర
కాకతీయ రాజుతో పోరాడి నేలకొరిగిన కోయరాజులు
నాటినుంచే మేడారం జాతరకు శ్రీకారం
ములుగు(జనంసాక్షి):రెండేళ్లకోమారు జరిగే మేడారం జాతర ఈ యేడు జనవరి 28 నుండి 31 వ తేదీ వరకు జరుగుతుంది. జాతర మొదటి రోజైన 28న కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకు వస్తారు. అదే రోజు కొండాయి నుండి గోవిందరాజులును, పూనుగుండ్ల నుండి పడిగిద్దరాజులను గద్దెలపై ప్రతిష్టింప చేస్తారు. రెండవ రోజున 29నసమ్మక్కను చిలుకల గుట్ట నుండి పూజార్లు తీసుకోని వచ్చి గ్దదెపై ప్రతిష్టింప చేస్తారు. మూడో రోజున శుక్రవారం పూర్తి మొక్కుల చెల్లింపు, నాలుగవ రోజు సాయంత్రం దేవ దేవతలను తిరిగి వన ప్రవేశం చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆదివాసులే పూజార్లు కావడం ఈ జాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించడం ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లము) నైవేద్యంగా సమర్పించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్ట ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాల కొకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్టాలైన్ర ఆంధప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్టాల్ర నుంచి సుమారు కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందింది. 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాతంలోని పొలవాసను పాలించే ఆదివాసి దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న ఇద్దరు సంతానం. కాకతీయులకు ప్రతీ సంవత్సరం చెల్లించే కప్పం కట్టలేదన్న కారణంతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తుతాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పోయి అజ్ఞాత వాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా వుంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేక పోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ ఆదివాసిల సార్వభౌమునికి వ్యతిరేకంగా తిరుగుబాటు భావాజాలాన్ని నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణాలతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పోరాడిన పగిడిద్దరాజు, నమ్మక్క, సారక్క, జంపన్న, గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేసినప్పటికీ సుశిక్షుతులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్ప తిప్పలు పెడుతుంది. ఆదివాసి మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడు అవుతాడు. చివరికి సమ్మక్కను కాకతీయుల సైన్యం వెనుక వైపు నుండి బరిసెతో పొడుస్తారు. శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్కమ్రించి చిలుకల గుట్టవైపు వెళుతూ మార్గమధ్యములోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల కుంకుమ భరణ లభిస్తుంది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క ` సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గిరిజనుల ఆచారం మేరకు ఈ సంప్రదాయ జాతరకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. గద్దెలను కొత్తగా నిర్మించింది. ఈ పనులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభిస్తారు.


