ఎన్నడూ లేని విధంగా అభివృద్ది : ఎమ్మెల్యే
వరంగల్,ఆగస్ట్28 (జనంసాక్షి): దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు పెడుతుందని వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్పారు. సంక్షేమ పథకాలే తమను అన్ని ఎన్నికల్లో గెలిపించాయని అన్నారు. ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం కోరుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులో ప్రసవాలు జరిగి ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగ శిశువుకు రూ.12 వేలు, కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని అన్నారు. ఎకరానికి 5 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తామని సిఎం కెసిఆర్ ఇచ్చిన హావిూని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు జరుగుతుంటే కాంగ్రెస్, భాజపా పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. గడిచిన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్దపీట వేశారని అన్నారు. సమైక్య పాలనలో కోల్పోయిన అభివృద్ధితెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే సాధ్యమైందని అన్నారు. గత కాంగ్రెస్,టిడిపి పాలకులకు చిత్తశుద్ధిలేక అభివృద్ధిని విస్మరించారని అన్నారు. అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు. విమర్శలు చేసేవారు జరుగుతున్న పనులను చూడాలన్నారు.