ఎపి హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

ప్రమాణం చేయించిన గవర్నర్‌ హరిచందన్‌
అమరావతి,ఆగస్టు4జనం సాక్షి(): ఏపీ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయమూర్తులుగా నియమితులైన అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, దుప్పల వెంకటరమరణ, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌, బండారు శ్యామ్‌ సుందర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌, తల్లాప్రగడ మల్లికార్జునరావులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మాతృమూర్తి మరణించడంతో ఆయన కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. అందువల్ల కొత్త న్యాయమూర్తులతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. న్యాయాధికారుల కోటాలో అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, దుప్పల వెంకటరమరణ, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌, బండారు శ్యామ్‌ సుందర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌, తల్లాప్రగడ మల్లికార్జునరావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని గత నెల 20న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. వీరిలో రవీంద్రబాబు, కృపాసాగర్‌, శ్యామ్‌సుందర్‌, శ్రీనివాస్‌ శాశ్వత న్యా యమూర్తులుగా.. వెంకటరమణ, చక్రవర్తి, మల్లికార్జునరావు రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారని కేంద్రన్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.