ఎర్రపూల వనంలో పువ్వురాలింది

2

– విరసం వ్యవస్థాపక సభ్యుడు ప్రముఖ కవి, రచయిత తలసాని ప్రసాద్‌ ఇకలేరు

విశాఖపట్టణం,జులై25(జనంసాక్షి):

విరసం నేత, ప్రముఖ కవి, విమర్శకులు చలసాని ప్రసాద్‌(83) విశాఖలోని ఆయన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో తన నివాసంలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అంబులెన్స్‌ చేరుకునేలోగానే ఆయన మరణించారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పెనుమర్రు. నమ్మిన సిద్దాంతం కోసం పనిచేసిన ప్రసాద్‌ ఎన్నో సార్లు జైలు జీవితం గడిపారు. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు జైలుకు వెళ్లారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది. కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిఆర్‌లతో ఆయన సన్నిహిత సంబంధాలుండేవి. పలు గ్రంథాలను ఆయన సంకలనం చేశారు. శ్రీశ్రీ సాహిత్యంపై ఆయనకు ఎనలేని పట్టు ఉంది. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాల్లో ఆయన ముఖ్యమైన భూమిక పోషించారు. చలసాని ప్రసాద్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన చివరి శ్వాస వరకు పాల్గొంటూ వచ్చారు. కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగారు. ఆయన మృతి పట్ల విరసం సభ్యులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

విరసం ప్రసాద్‌కు పలువురు నివాళి

విరసం వ్యవస్థాపకుడు చలసాని ప్రసాద్‌ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన అలుపెరుగని కమ్యూనిస్ట్‌ యోధుడని శ్లాఘించారు. విరసం వ్యవస్థాపకులలో ప్రధానమైన వాడిగా  ఆయన పేరు ఎవరు ప్రస్తావించినా విరసం ప్రసాద్‌ అంటారు. విరసం అన్న మాట దాదాపుగా ఆయన ఇంటిపేరై పోయింది.  1970లో విరసం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. 1985 నుంచి 88 వరకు మూడేళ్ల పాటు విరసానికి కార్యదర్శి. 1998 నుంచి 2002 వరకు అధ్యక్షులు. అయినా ఆయన సాహిత్యోద్యమంలో తనను తాను కార్యకర్తగానే పరిగణించే వారు. ప్రసాద్‌ సాహితీ సృజన తక్కువేవిూ కాదు. కవిత్వం, వ్యాసాలు రాశారు. అవసరమైనప్పుడల్లా సామాజిక, రాజకీయ అంశాల విూదా రాశారు.  1932 డిసెంబర్‌ 8న కృష్ణా తీరంలోని చల్లపల్లి దగ్గరిలో నాదెండ్ల వారిపాలెంలో చలసాని ప్రసాద్‌  కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టారు. విద్యాభ్యాసం, ఉద్యోగ రీత్యా ఆయన

జీవిత కాలంలో ఎక్కువభాగం విశాఖ పట్నంలోనే గడిచింది. పలు సందర్భాల్లో  ఆయనను ప్రభుత్వం జైలులో పెట్టింది. ఎమర్జెన్సీలో జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత అనేక సందర్భాలలో జైలుకెళ్లారు.

సాహిత్య రంగంలో ఆయన కృషి రెండు పాయలుగా సాగింది. సాహిత్యోద్యమాలను నిర్మించడంలో గత అర్ధ శతాబ్దంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఉద్యమజీవులందరికి లాగే తన సృజనాత్మక శక్తిని ప్రోది చేసుకుని, పదిల పరచుకుని ఆ రంగంలో కీర్తి సంపాదించాలన్న దుగ్ధ ఆయనకేనాడూ లేదని ప్రముఖ రచయిత ఆర్వీ రామారావు తెలిపారు.  సాహితీ రంగం కూడా ఆయనను అదే దృష్టితో చూసింది. తొమ్మిదో తరతి విద్యార్థిగా ఉన్నప్పుడు 1947 ‘నవయుగ’ సంచికలో ‘ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరి ఆయుధమోయ్‌’ అన్న పాటతో మొదలెట్టి కవిత్వం, సాహిత్య విమర్శ, ముందుమాటలు, సాహిత్య, రాజకీయ అంశాల విూద వ్యాసాలు దండిగానే రాశారు. చాలా కాలంపాటు ఒకటి రెండు అనువాదాలు తప్ప స్వతంత్ర రచనలుగా ప్రచురించడం విూద ఆయన దృష్టి ఎన్నడూ లేదు. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబ రావు సంపుటాలను ప్రసాద్‌ వెలువరించిన పద్ధతి సాహిత్యాన్ని ఎడిట్‌ చేయడంలో కొత్త ఒరవడి దిద్దింది.  సంపుటీకరించడం అంటే కలిపి కుట్టేయడం కాదు అని రుజువు చేశారు. వాటికి ఆయన సమకూర్చిన ముందు మాటలు ఆ రచయితల ఆత్మను ఆవిష్కరిస్తాయి. ప్రసాద్‌ రచన విూద కన్నా సాహిత్యాధ్యయనం విూద ఎక్కువ దృష్టి పెట్టారు. అంతకన్నా సాహిత్యోద్యమ నిర్మాణమే ఆయనకు పరమావధి అయింది. ఆయన విరసానికి నాయకుడైతే నేను అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తను. ఆ విభేదాలు, వైషమ్యాలు అక్కడివరకే పరిమితం తప్ప వ్యక్తిగత స్నేహానికి ఎన్నడూ అడ్డు తగలలేదు. విశాఖలో ఆయన ఇల్లు చిన్నదే. కాని దాని విూద పై అంతస్తు వేసి పుస్తకాలతో నింపేశారు.  సోషలిజం విూద ఉన్న అపారమైన అభిమానం కారణంగా ప్రసాద్‌ కు రష్యాను దూషించడం నచ్చలేదు. దారులు వేరైనా సిద్ధాంతం ఒకటే అన్న అవగాహన వల్ల సమకూరే సమ్యక్‌ దృక్పథం ఇది.