ఎస్‌బీఐ రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి.. 

నవంబర్‌ 1నుంచే కొత్త వడ్డీరేట్లు అమల్లోకి
ముంబయి,నవంబర్‌2(జ‌నంసాక్షి) : ప్రభుత్వ రంగం బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పది నెలల వ్యవధిలో ఎస్‌బీఐ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. అన్నింటిపైనా 5 బేసిస్‌ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. నవంబర్‌ 1 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఎంసీఎల్‌ఆర్‌( మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్స్‌) కింద ఉన్న రుణాలపై ఇప్పటి వరకు ఏడాదికి 8శాతం వడ్డీ రేటు ఉండగా దాన్ని 7.95శాతంకి కుదించింది. అదే విధంగా వివిధ కాలవ్యవధితో తీసుకునే రుణాలపై 0.05 శాతం వడ్డీని తగ్గించింది. గృహ రుణాలపై వడ్డీని (0.05శాతం) 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 8.30శాతానికి ఇవ్వనుంది. వాహన రుణాలపై వడ్డీని 8.75శాతం నుంచి 8.70శాతానికి తగ్గించింది. తాజా రేట్లు కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. ఎంసీఎల్‌ఆర్‌ వ్యవస్థ కింద రుణాలు తీసుకున్న వారు మాత్రం కొంత సమయం వేచి చూడాల్సిందే..