ఏపీ ఎన్జీవో ప్రెసిడెంట్‌ 420

హైదరాబాద్‌, జూన్‌ 2 (జనంసాక్షి) :
సహుద్యోగులను మోసం చేసిన ఏపీ నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డిపై 420 కేసు నమోదైంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఏపీ హౌసింగ్‌ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ ఇతర అంశాల్లో సభ్యుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు అభియోగాలు నమోదు చేశారు. అలా వసూలు చేసిన మొత్తంలో రూ. 13 కోట్ల వరకూ గోపాల్‌రెడ్డి దుర్వినియోగం చేశారని హైదరాబాద్‌ జిల్లా సహకార సంఘం డెప్యూటీ రిజిస్ట్రార్‌ హరిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు పలు కీలక పత్రాలను పరిశీలించిన అనంతరం గోపాల్‌రెడ్డి సహా మరో 19 మందిపై ఐపీసీ 406, 409, 420, 180, 120`బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సహకార శాఖ అధికారులు సమర్పించిన పలు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం దర్యాప్తు ప్రారంభిస్తామని సీసీఎస్‌ పోలీసులు పేర్కొన్నారు.