హామీల అమలుకు రోడ్డెక్కుతున్న రైతన్న

` అయినా పట్టని రాష్ట్రప్రభుత్వం
` కేటీఆర్‌ విమర్శ
హైదరాబాద్‌ (జనంసాక్షి):తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతలను కష్టాలను వెంటాడుతూనే ఉన్నాయి. రేవంత్‌ పరిపాలనలో రైతు కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేకుండా పోయింది. 24 గంటల ఉచిత విద్యుత్‌ కోసం పోరాటం, రైతుబంధు కోసం పోరాటం, రుణమాఫీ కోసం పోరాటం.. ఇలా అనేక రకాలుగా అన్నదాతలు రోడ్డెక్కుతూనే ఉన్నారు. చివరకు వరద పాలైన పంటలకు నష్ట పరిహారం చెల్లించడంలో కూడా రైతులను రేవంత్‌ ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని.. వంచనతో మళ్లీ రేవంత్‌ సర్కార్‌ ముంచిందంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం అని మండిపడ్డారు. 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు.. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా..? అని కేటీఆర్‌ నిలదీశారు. పంట నష్టం అంచనాలను తలకిందులుగా ఎందుకు మార్చేసారు..? ఏకంగా 3 లక్షల 35 వేల ఎకరాలు ఎట్లా ఎగిరిపోయాయి..? 79,574 ఎకరాలకే కంటి తుడుపుగా పరిహారం ఇచ్చి మమ అనిపించడం దారుణం..! అపార నష్టంతో అల్లాడుతున్న రైతుల ఆదుకునే విషయంలోనూ ఉదారంగా వ్యవహరించలేరా..? మానవత్వం ప్రదర్శించలేరా..? 5.20 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్రం రిపోర్ట్‌ ఇచ్చింది నిజం కాదా..? ఇప్పుడు ఇంత భారీ కోతలా..? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. పెట్టిన పెట్టుబడి కొట్టుకుపోయి.. రాళ్లూ ఇసుక మేటలు వేసిన పొలాలను బాగుచేసుకోవడానికి మీరిచ్చే 10 వేలు ఏ మూలకూ సరిపోవు.. మరి అందులోనూ కుదింపులు చేయడం ఏమాత్రం సమంజసం కాదు..! అన్నదాత ఆపదలో వున్నప్పుడు ఆదుకోవడం.. ప్రభుత్వాల బాధ్యత..! ఆ బాధ్యత నుంచి తప్పించుకోకుండా నష్టం వాటిల్లిన ప్రతి ఎకరానికి పరిహారం అందించండి..! రుణమాఫీలో దగా జరిగింది.. రైతు భరోసా జాడా పత్తా లేదు.. వరదలు ముంచెత్తి నష్టాల్లో.. కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు అండగా నిలవట్లేదు..! అన్నదాతపై ఎందుకీ వివక్ష..? అని రేవంత్‌ ప్రభుత్వాన్ని కేటీఆర్‌ నిలదీశారు.