ఐఏఎస్‌ల కేడర్‌ మార్పుకు కేంద్రం నో

` ఐఏఎస్‌లు వాకాటి కరుణ, రోనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, వాణీప్రసాద్‌, ప్రశాంతిలకు షాక్‌
` ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు
` ఐపీఎస్‌లు అంజనీ కుమార్‌, అభిషేక్‌ మొహంతిల అభ్యర్ధననూ పట్టించుకోని కేంద్రం
` ఏపీ వెళ్లాల్సిందేనని.. 16లోగా అక్కడ రిపోర్టు చేయాల ఆదేశాలు
` తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వారీగా విభజనపై కీలక నిర్ణయం
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో కొనసాగుతున్న పలువురు ఐఏఎస్‌ అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆయా ఐఏఎస్‌ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా కొనసాగుతున్న ఆమ్రపాలి కాట, విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న రోనాల్డ్‌ రోస్‌, వాణిప్రసాద్‌, ప్రశాంతితో పాటు పలువురు అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ కేడర్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కేటాయించాలన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ల అభ్యంతరాలను తోసిపుచ్చింది. వాకాటి కరుణ, రోనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, వాణీప్రసాద్‌, మల్లెల ప్రశాంతి తదితర అధికారులు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అయితే, వారందర్నీ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది.ఈ మేరకు ఐఏఎస్‌ అధికారుల పేరుతో లేఖను రాస్తూ.. వాటి కాపీలను తెలంగాణ, ఏపీ చీఫ్‌ సెక్రెటరీలకు కేంద్రం పంపింది. అయితే, తెలంగాణ కేడర్‌ కావాలంటూ 11 మంది అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే, అధికారుల వినతిని కేంద్రం తిరస్కరించింది. అధికారులంతా సొంత రాష్ట్రంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందిన అనంతరం ఆమ్రపాలి కేంద్ర సర్వీసుల నుంచి తెలంగాణ సర్వీసుల్లో చేరారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, మూసీ రివర్‌ ఫ్రంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, హెచ్‌జీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ కమిషనర్‌గా కొనసాగుతున్న సమయంలోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఉన్నప్పటికీ ఆమెకే ఐదు కీలక పోస్టులను సీఎం రేవంత్‌రెడ్డి కేటాయించారు. ఆ తర్వాత జరిగిన బదిలీల్లో మిగతా పోస్టులను నుంచి ఆమెను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిషనర్‌ పోస్టుతోపాటు పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ అధికారి కాటా అమ్రపాలికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ షాక్‌ ఇచ్చింది. తనను తెలంగాణ క్యాడర్‌లోనే కొనసాగించాలని పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించింది. ఆమెను విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయిచారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌లో జాయినవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన అమ్రపాలి తనను తెలంగాణ స్థానికత ఉన్న అధికారిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిని తోసి పుచ్చారు. ఖండేకర్‌ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆమె ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కే చెందుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సివిల్‌ సర్వీసు అధికారుల కేటాయింపు కోసం ఖండేకర్‌ కమిటీని నియమించారు. ఆ కమిటీ నిబంధనల ప్రకారం విభజించింది. అయితే ఆ నివేదికలో పేర్కొన్న పలువురు తమ క్యాడర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి,క్యాట్‌కు దరఖాస్తుకు పెట్టుకున్నారు. ఏపీకి కేటాయించిన ఎక్కువ మంది తాము తెలంగాణ స్థానికతతో ఉన్నామని తమకు తెలంగాణ క్యాడరే కావాలని ఉండిపోయారు. అలాంటి అధికారి అయిన సోమేష్‌ కుమార్‌ ఏపీలో సీఎస్‌గా ఉండగా కోర్టు ఏపీకి వెళ్లాల్సిదేనని స్పష్టం చేసింది. దాంతో ఆయన తెలంగాణ నంచి రిలీవ్‌ అయి ఏపీలో రిపోర్ట్‌ చేసి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. ఇప్పుడు అమ్రపాలికి కూడా దాదాపుగా అదే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌ కమిషనర్‌ గా ఉన్న ఆమె ఉన్న పళంగా ఏపీలో రిపోర్టు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఖండేకర్‌ కమిటీ సిఫారసులు చేసిన సమయంలో స్థిర నివాసం అనే కాలమ్‌ను కీలకంగా తీసుకున్నారు. యూపీఎస్సీకి దరఖాస్తు చేసిన సమయంలో కాట అమ్రపాలి తన పర్మినెంట్‌ అడ్రస్‌గా విశాఖ పట్నంను పేర్కొన్నారు.  ఖండేకర్‌ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రత్యూష్‌ సిన్హా కమిటీ ఆ నివేదిక ఆధారంగా  క్యాడర్‌ ను కేటాయించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఖండేకర్‌ కమిటీ ఆమెను ఏపీకి కేటాయించింది. అయితే తనను తెలంగాణ స్థానికురాలిగా పరిగణించి.. తెలంగాణకే కేటాయించాలని ఆమె అప్పీల్‌ చేసుకున్నారు. ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మొదట్లోనే ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. హైకోర్టు కూడా ఖండేకర్‌ కమిటీ ఆధారంగా  ప్రత్యూష్‌ సిన్హా కమిటీ చేసిన సిఫారసులనే అమలు చేయాలని స్పష్టం చేసింది.  కాట అమ్రపాలికి ప్రస్తుతం అన్ని మార్గాలు మూసుకుపోయినట్లేనని ఆమె ఖచ్చితంగా తెలంగాణలో రిలీవ్‌ అయ్యి.. ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని భావిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరంగల్‌ జిల్లాకు కలెక్టర్‌ గా చేసిన అమ్రపాలి తర్వాత కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి ఓఎస్డీగా.. ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పని చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం  వచ్చిన తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చారు రేవంత్‌ సర్కార్‌ లో ఆమెకు కీలక పోస్టులు దక్కాయి. అయితే ఇప్పుడు ఏపీకి తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరది.