ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి

జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుఢీ కొని హోంగార్డు మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన మెట్‌పల్లి పట్టణ శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్‌పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు సుబ్బరాజు జగిత్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడుకాగా, సుబ్బరాజు ఓ హోటల్‌లో టిఫిన్‌ తీసుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుబ్బరాజు బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుబ్బరాజు మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.