ఒబామాకు ఘనస్వాగతం

4

దిల్లీ, జనవరి 25(జనంసాక్షి): ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ ఒబామాకు స్వాగతం పలికారు. అనంతరం ఒబామా త్రివిద దళాల ్ణొరవవందనం స్వీకరించారు. కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌,సుష్మాస్వరాజ్‌, వెంకయ్యనాయుడు, పీయూష్‌గోయల్‌, పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న ఒబామా ఆ తర్వాత రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మగాంధీ సమాధికి నివాళులర్పించనున్నారు. అనంతరం హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. సాయంత్రం మోదీ, ఒబామాలు సంయుక్తంగా ప్రెస్‌విూట్‌ నిర్వహించారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ఒబామా దంపతులకు రాష్ట్రపతి ఇచ్చిన విందులో పాల్గొన్నారు.

ఇక జనవరి 26న ఉదయం ఒబామా 9.25 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. ఉదయం 10గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. తరువాత సీఈవోల సదస్సులో ఒబామా ప్రసంగం ఉంటుంది. 26న సాయంత్రం 5:45కి మోడీతో కలిసి సీఈవోల రౌండ్‌టేబుల్‌ సమావేశానికి హాజరుకానున్నారు. 26న సాయంత్రం 6:50 నుంచి 7:20 వరకు ఒబామా ప్రసంగం ఉంటుంది. 26న రాత్రి ప్రధాని ఇచ్చే విందుకు ఒబామా దంపతులు హాజరుకానున్నారు. 27న సాయంత్రం 4:35కు పాలం ఎయిర్‌పోర్టుకు ఒబామా చేరుకోనున్నారు. సాయంత్రం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఒబామా బయలుదేరి వెళతారు. భద్రతా కారణాల దృష్ట్యా  ఒబామా భారత పర్యటన షెడ్యూల్‌ను కుదించడమే గాకుండా ఆగ్రా పర్యటనను కూడా రద్దు చేశారు. ఒబామా ఆగ్రా పర్యటనను రద్దు చేస్తున్నట్టు ఆయన భద్రతా సిబ్బంది ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఒబామా తన భార్య మిషెల్‌ ఒబామాతో కలిసి ఈనెల 27న ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా తాజ్‌మహల్‌ పర్యటనను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఒబామా భారత్‌ పర్యటన రెండు రోజులకే పరిమితమైంది