కాంగ్రెస్ నీతులు పలకడం సిగ్గుచేటు: జవదేకర్
బెంగళూరు,మే19( జనం సాక్షి): కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతీర్పును కాంగ్రెస్ ఉల్లంఘించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కర్నాటక ప్రజలు తిరస్కరించారనీ, అందుకే అసెంబ్లీ ఎన్నికలలో 14 మంది కాంగ్రెస్ మంత్రులు పరాజయం పాలయ్యారని ఆయన అన్నారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆయన ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయారని చెప్పారు. కాంగ్రెస్ అవినీతి బయటపడకూడదనే ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చినా జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి బీజేపీ అధికారంలోనికి రాకుండా అడ్డుకుందని జావడేకర్ అన్నారు. ఇదెంతకాలమో చూస్తామని అన్నారు. అవకాశవాద రాజకీయల ఉచ్చులో జెడిఎస్ బలికాక తప్పదన్నారు. కాంగ్రెస్ నీతి గురించి మాట్లాడే ముందు గతాన్ని గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.