కాలా విడుదలకు లైన్‌ క్లియర్‌..

– థియేటర్స్‌ వద్ద రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
బెంగళూరు, జూన్‌5(జనం సాక్షి) : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘కాలా’ చిత్రం కర్ణాటకలో విడుదలకు మార్గం సుగగమైంది. సినిమా విడుదలకు కర్ణాటక హైకోర్టు మంగళవారం అనుమతించింది. కావేరీ జలాలను తమిళనాడుకు కర్ణాటక విడుదల చేయాలంటూ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కన్నడ అనుకూల సంస్థలు ‘కాలా’ విడుదలను అడ్డుకుంటామంటూ ప్రకటించాయి. దీంతో డిస్టిబ్యూట్రర్లు, ఎగ్జిబిటర్లు వెనక్కితగ్గారు. ఈ నేపథ్యంలో ‘కాలా’ విడుదలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. సినిమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ…ఎలాంటి అవాంతరాలు కలకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానదేనని పేర్కొంది. భారీ అంచనాల మధ్య ‘కాలా’ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.