కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల

రూ.19,500 కోట్లు విడుదల చేసిన కేంద్రం
న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పీఎం కిసాన్‌ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ స్కీమ్‌ కింద 9వ విడత నిధులను ప్రధాని మోడీ రిలీజ్‌ చేశారు. దీంతో 9.75 కోట్ల పైచిలుకు రైతు కుటుంబాలకు రూ.19,500 కోట్లు అందనున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తోపాటు పలువురు రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సింగ్‌లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం గురించి ప్రధాని చర్చించారు. కాగా, పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తోంది. ఏటా మూడు విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేలు చొప్పున అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. ఇప్పటివరకు ఈ స్కీమ్‌ కింద రైతుల కోసం మొత్తంగా రూ.1.30 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది.