కులవృత్తులకు పెద్దపీట: ఎమ్మెల్యే

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): అన్ని కులవృత్తులకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించి సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశాయని గుర్తుచేశారు. తెలంగాణలో ఈ పార్టీలు పూర్తి మనుగడ కోల్పోయాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గొర్రెలు, మేకల పెంపకందారులకు 75శాతం సబ్సీడిపై యూనిట్లు ఇచ్చే పథకాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కులవృత్తులను ఆదరించిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని అన్నారు. అన్ని కుల, మతాల సంసృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలకూ సమన్యాయం చేస్తున్నారని అన్నారు. సామాజిక న్యాయం చేస్తూ ప్రభుత్వం అన్ని వర్గాల మన్ననలను పొందుతున్నదని చెప్పారు. సీమాంధ్ర నాయకుల హయాంలో కులవృత్తులు మనుగడ కోల్పోయాయని, అప్పుడు వలసలు పెరిగాయని అన్నారు.