కొత్తగా మరో ఆరు సింగరేణి గనులు
నేడు శంకుస్థపాన చేయనున్న సిఎం కెసిఆర్
మంచిర్యాల,ఫిబ్రవరి26(జనంసాక్షి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వేదికగా ఆరు కొత్త భూగర్భ గనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో దాదాపు 7వేల నుంచి 8 వేల మందికి ఉపాధి దొరికే అవకాశాలున్నాయి. సంస్థ లాభాలతో పాటు స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలనే యోచనతో ప్రభుత్వం సింగరేణి వ్యాప్తంగా కొత్తగా 11 భూగర్భ బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి విడుతలో ఆరు గనులు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ సింగరేణి ఎన్నికల తర్వాత ప్రకటించారు. కొత్తగా ఆరు భూగర్భ బొగ్గుగనులు ప్రారంభిస్తామని సిఎం కెసిఆర్ గతంలోనే ప్రకటించారు. అప్పుడు ఇచ్చిన హావిూని కేవలం 4 నెలల్లోనే అమలు చేయడానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో కొండాపురం, కొత్తగూడెం ఏరియాలో రాంపురం షాప్ట్ బ్యాక్, మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో కేకే-6 గని, కాసిపేట-2గని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీకే-5గని, కేటీకే-3 గనులకు సీఎం కేసీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వీటి ద్వారా సుమారు 7 వేల నుంచి 8 వేల వరకు కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నది. ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు లక్ష మందికిపైగా ఉద్యోగులతో కళకళలాడిన సింగరేణి సంస్థ క్రమంగా ప్రాభవం కోల్పోయింది. గత ప్రభుత్వాలు భూగర్భ గనులకు స్వస్తి పలికి కేవలం ఓపెన్ కాస్ట్ లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంతో రోజు రోజుకు ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ సింగరేణి అభివృద్ధికి నడుం బిగించారు. పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం, అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థల్లో ప్రస్తుతం 52 వేల 534 మంది కార్మికులు పని చేస్తున్నారు.
సింగరేణి సంస్థల్లో గడిచిన 20 ఏండ్ల కాలంలో కార్మికుల సంఖ్య దాదాపు 50 శాతానికి పడిపోయింది. 1990 తరువాత అసలు ఉద్యోగాల ఊసే లేకుండా పోయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2014 నుంచి ఇప్పటి వరకు 5 వేల 600 మందికి సంస్థలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మరో 750 పోస్టులకు అధికారులు గత నెలలో
నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో మెడికల్ అన్ ఫిట్ అయిన వారిలో నెలకు 25 మందిని మాత్రమే సంస్థ ఉద్యోగంలోకి తీసుకునేది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. సీఎం కేసీఆర్ మెడికల్ ఆన్ఫిట్ అయిన 3600 కార్మికుల పిల్లలకు ఒకేసారి ఉద్యోగాలు కల్పించారు. సింగరేణి ద్వారా జాబ్ మేళా నిర్వహించి వేలాది మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు.