కోహ్లీ ముసిముసిగా మురిసిపోయాడు

కోల్కతా: ఐపీఎల్ 8 ప్రారంభం సందర్భంగా అభిమానులతోపాటు ఓ క్రికెటర్ కూడా సామాన్య అభిమానిలా తెగ మురిసిపోయాడు. ఆయన ఎవరో కాదు ప్రముఖ భారత క్రికెటర్.. ప్రస్తుత ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంకు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ. ధగధగా మెరుస్తున్న విద్యుత్ కాంతుల మధ్య, బాణాసంచా వెలుగులతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో సీజన్ అట్టహాసంగా మంగళవారం సాల్ట్ లేక్ స్టేడియంలో ప్రారంభమైన విషయం తెలిసిందే.  అక్కడ వీడియో కవరేజ్కి వచ్చినవారంతా ఒక్కసారి తమ కెమెరా కన్నులు విరాట్ కోహ్లీ వైపు తిప్పాయి.

ఆ సమయంలో తన హావభావాలు ఎలా ఉన్నాయా అని దగ్గరగా చూశారు. ఆ సందర్భంలో అతడు తొలుత కొంత అసహనంగా కనిపించినా తర్వాత మాత్రం గాల్లో తేలిపోతున్నంత ఆనందంలో కనిపించాడు. ఎవరికీ కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకుని ముసిగా నవ్వుతూ కనిపించాడు. అందుకు కారణం ఏమిటో తెలుసా.. ఐపీఎల్ ప్రారంభంలో తన ప్రేయసి అనుష్కశర్మ అదిరేపోయే స్టెప్పులతో అదరగొట్టింది, పీకే, జబ్ తక్ హై జాన్వంటి చిత్రాల్లోని పాటలకు డ్యాన్స్లు చేసి మురిపించింది.  దీంతో కోహ్లీ చాలా ఎంజాయ్ చేసినట్లుగా కనిపించాడు.