క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
– రాష్ట్ర మంత్రి జోగురామన్న
– స్పోర్ట్స్ స్కూల్లో ప్లయింగ్ రోప్లను ప్రారంభించిన మంత్రి
అదిలాబాద్, సెప్టెంబర్4(జనం సాక్షి) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పెద్దపీట వేశారని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం అదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. స్టేడియంలోని స్పోర్ట్స్ స్కూల్ లో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను, ఫ్లయింగ్ రోప్ లను మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడల స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. మినరల్ వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతులపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థిని, విద్యార్థులకు ఏర్పాటు చేసిన డార్ మెట్రీలతో పాటు వంట గదులను మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని మంత్రి రుచి చూశారు. విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం తిన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. గ్రావిూణ స్థాయిలోని క్రీడాకారుల్లో దాగియున్న ప్రతిభను వెలికితీసి వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. తెలంగాణ నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులు గుర్తింపు సాధించారన్నారు మంత్రి తెలిపారు. విద్యతో పాటు క్రీడలకు సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ నుండి విద్యార్థులు సైతం క్రీడల్లో రాణించాలని మంత్రి ఆకాంక్షించారు.