గాంధీలో మరో ఇద్దరు స్వైన్‌ ఫ్లూ రోగుల మృతి

4

-భయాందోనళో ఆస్పత్రి సిబ్బంది

హైదరాబాద్‌,జనవరి30,జనంసాక్షి:  గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లొతో మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చాదర్‌ఘాట్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు, సయ్యద్‌నగర్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి స్వైన్‌ఫ్లొ చికిత్స పొందుతూ మృతిచెందారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 36 మంది స్వైన్‌ఫ్లొకి చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. మెదక్‌ జిల్లాలో 8 నెలల బాలుడికి స్వైన్‌ఫ్లొ నిర్దారణ అయిందని నోడల్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. బాలుడికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో తెలంగాణ స్వైన్‌ ఫ్లూతో వణికిపోతోంది. పెరుగుతున్న వైరస్‌ వ్యాప్తి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ.. వైరస్‌ వ్యాప్తిని అదుపులోకి తీసుకురాలేకపోతోంది. మరోవైపు చికిత్సనందించే వైద్యులకు కూడా స్వైన్‌ ఫ్లూ సోకుతుండటం  ప్రజలను కలవరపెడుతోంది. స్వైన్‌ ఫ్లూ పై యుద్ధం ప్రకటించామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించుకుంటున్నప్పటికీ.. రోజురోజుకి విజృంభిస్తున్న స్వైన్‌ ప్లూ ను నియంత్రించడంలో పాలకులు విఫలమవుతున్నారు. కనీసం రోగులకు సేవలందించే వైద్యులకైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.  దీంతో స్వైన్‌ ప్లూ రోగులకు చికిత్సలు అందించేందుకు ఆసుపత్రి సిబ్బంది భయడుతున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే గాంధీలో నలుగురు మృతి చెందారు. స్వైన్‌ ఫ్లూ వైరస్‌ ఎన్నో ప్రాణాలను కబళించి వేస్తోంది. తెలంగాణలో స్వైన్‌ ఫ్లూతో మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు.  వీరితో ఇప్పటి వరకు స్వైన్‌ ఫ్లూతో మృతి చెందిన వారి సంఖ్య 23కి చేరినట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 33 మంది పెద్దవారు, 10 మంది చిన్నారులు స్లైన్‌ ఫ్లూ పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నట్లు వారు చెప్పారు. ఇక ఉంటే స్వైన్‌ ఫ్లూ సాధారణ ప్రజలతో పాటుగా చికిత్సలు అందించే వైద్యులకు సైతం సోకుతోంది. గత వారంలో గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరికి సోకగా.. తాజాగా మరో 12 మంది జూనియర్‌ వైద్యులకు స్వైన్‌ ఫ్లూ సోకింది. హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిలో పీజీ చేస్తున్న జూనియర్‌ డాక్టర్‌లలో 12 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. వీరితో పాటు ఉస్మానియా ఆసుపత్రిలో మరో 13 మంది స్వైన్‌ ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. కాగా మరో 18 మందిని అనుమానితులుగా గుర్తించి వారి నమూనాలను పరిరక్షించేందుకు ల్యాబ్‌కు పంపించారు. దీంతో వైద్య సిబ్బంది కూడా సేవలకు జంకుతున్నారు.