గుజరాత్‌లో కుప్పకూలిన యుద్ధవిమానం

– పైలట్‌ మృతి
జామ్‌నగర్‌, జూన్‌5(జనం సాక్షి) : భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం ఒకటి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కుప్పకూలిపోయింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణ శిక్షణలో భాగంగా ఈ ఉదయం జామ్‌నగర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి నుంచి బయల్దేరిన జాగ్వార్‌ యుద్ధవిమానం కచ్‌లోని ముంద్రా ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌ సంజయ్‌ చౌహన్‌ ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని ఐఏఎఫ్‌ అధికారులు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అసోంలో ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుంది. మజులీ ద్వీపంలో ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎంఐ-17 ఛాపర్‌ కూలిపోయి ఆరుగురు గాయపడ్డారు.