గూగుల్‌ దిగ్గజంతో రేవంత్‌భేటి

` సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి
` పలు అంశాలపై అధికారులతో చర్చ
` సెంటర్‌ విస్తరణకు జోయిటిస్‌ కంపెనీ సుముఖం
హైదరాబాద్‌(జనంసాక్షి): అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలో గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై రేవంత్‌రెడ్డి చర్చలు జరిపినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడిరచాయి. గూగుల్‌ ప్రతినిధులు వారికి ఆహ్వానం పలికారు.సీఎం వెంట మంత్రి శ్రీధర్‌బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జోయిటిస్‌ కంపెనీ హైదరాబాద్‌లోని కెపాబులిటీ సెంటర్‌ విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్‌ నుంచి ఈ విస్తరణ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. హైదరాబాద్‌లో జోయిటిస్‌ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తమ జోయిటిస్‌ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించే నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని అన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీలో జోయిటిస్‌ రంగ ప్రవేశం హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తెస్తుందని సీఎం అన్నారు. ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని జోయిటిస్‌ కంపెనీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ కీత్‌ సర్‌బాగ్‌ అన్నారు. తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందన్నారు. హైదరాబారద్‌లో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని జోయిటిస్‌ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ రాఘవ్‌ అన్నారు. ప్రపంచంతో పోటీ పడే సేవలందించటంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామన్నారు. జోయిటిస్‌ కంపెనీ విస్తరణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులు, తమ ప్రభుత్వ విధానాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాబోయే సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాలతో పాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు. జోయిటిస్‌ కంపెనీ దాదాపు 70 సంవత్సరాలుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్దారణ, నిరోధించే మార్గాలు, చికిత్స సంబంధిత అంశాలపై పని చేస్తోంది. జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తోంది. ఔషధాలతో పాటు వ్యాక్సిన్‌లు, రోగ నిర్దారణలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణలపై దాదాపు వంద దేశాలకు సేవలు అందిస్తోంది.