గోడ దూకితే అనర్హతే!
– కాంగ్రెస్ తిరుగబాటు ఎమ్మెల్యేల వేటు సబబే
– ఉత్తరాఖండ్ హైకోర్టు
నైనిటాల్,మే9(జనంసాక్షి):ఉత్తరాఖండ్ బలపరీక్షకు ముందే అక్కడి కాంగ్రెస్ పార్టీకి తొలి విజయం దక్కింది. అనర్హత వేటు పడిన 9మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు అయింది. తమపై స్పీకర్ వేసిన అనర్హతను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఉత్తరాఖండ్ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దీంతో మంగళవారం జరిగే బలపరీక్షలో ఈ తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు. తమకు మంగళవారం నాటి విశ్వాస పరీక్షలో ఓటేసే అవకాశం ఇవ్వాలని వీరుఎ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. న్యాయస్థానం తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించినట్లు అయింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో మంగళవారం హరీశ్ రావత్ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం అవుతున్నారు. ఇక హైకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. హరీశ్ రావత్ నివాసం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. హైకోర్టు తీర్పుతో 9మంది ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు.