గోదావరిలో పెరుగుతన్న నీటిమట్టం

ఎగువన వర్షాలతో భారీగా వరదరాక
అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం

భద్రాచలం,జూలై11(జనం సాక్షి ):ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నీటి మట్టం క్రమేపి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే గోదావరి వరదలు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద అంతకంతకూ నీటిమట్టం పెరుగుతున్నది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో 49 అడుగులు దాటిన వరద ఉధృతి ఇప్పుడు 50.4 అడుగులకు చేరింది. మరికొన్ని గంటల్లోనే 53 అడుగులు దాటే అవకాశం ఉంది. దీంతో అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. ఉదయం 7 గంటలకు 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 12,79,307 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. నదిలో వరద ప్రవాహం భారీగా పెరగడంతో స్నానఘట్టాలు మునిగిపోయాయి. నది దిగువన ఉన్న ముంపు మండలాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భద్రాచలం వద్ద గోదావరి నదికి మెల్లగా వరదనీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు పెరగుఉదలను గమనిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు.ఎగువన ఉన్న ప్రాంతాల్లో పెరుగుదల ఉన్నందున సోమవారం కూడా ఇక్కడ వరద కొనసాగింది నాలుగు రోజులుగా కొత్త నీళ్లొచ్చి చేరడంతో ప్రవాహ స్థాయి పెరిగింది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆ ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఎగువన ఉన్న కాళేశ్వరం, ఇంద్రావతి నుంచి వస్తున్న వరదతో పాటు ఆగని వానల కారణంగా భద్రాద్రిలో మళ్లీ క్రమంగా పెరుగుదల చోటు చేసుకుంది. వరద సరళిని తెలుసుకునేందుకు రైతులు ఆసక్తి కనబర్చారు. కొన్నిచోట్ల లంకల్లోకి వరద చేరే ప్రమాదం ఉండడంతో కొంత ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ వాతావరణంలో వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలను పాటించేందుకు సిబ్బంది సంసిద్ధం కావాల్సి ఉంది. ఇప్పటికే భద్రాచలంలో లాంచీలను అందుబాటులో ఉంచారు. వరదల సమయంలో రాకపోకలకు ఆటంకం కలిగినా ఆహార పదార్థాల పంపిణీలో చిక్కులు తలెత్తకుండా పూర్తిస్థాయి నిల్వలను గోదాములకు తరలించాల్సి ఉంది. తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు ఎట్టకేలకు వరద నీరు చేరుకోవడం ప్రారంభమైంది. తాలిపేరుకు చింతవాగు, రోటెంతవాగుల నుంచి వచ్చే వరద నీరు ఇప్పటికీ చేరుకోలేదు. ఆ వాగుల నుంచి వరద నీరు వస్తే ప్రాజెక్టుకు మరింత భారీగా నీటి ప్రవాహం ఉంటుంది. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ ఇదివరికే ఇందుకు సంబంధించి వరద సవిూక్ష జరిపి అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. వరదలపై అధికారులను కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. గోదావరి వరదలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ముందస్తుగా ఆహార వస్తువులను సైతం నిల్వ ఉంచారు. బియ్యం, కిరోసిన్‌ తదితర వాటిని అందుబాటులో ఉంచారు.