*గోదావరి ముంపు ప్రాంతాల్లో ఎస్పి పర్యటన*
*పునరావాస కేంద్రాల్లోనీ బాధితులకు భరోసా*
*పలిమెల, జులై (జనంసాక్షి)* గోదావరి ముంపు ప్రాంతాల్లోనీ ప్రజలు అధైర్య పడద్దని వారికి అండగా ఉంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పలిమెల మండలంలోని ముంపు ప్రాంతాలల్లో పర్యటించిన ఎస్పి పెగడ పల్లి, ముకునూరు, పలిమెల పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధిత ప్రజలతో మాట్లాడి, వారికి భరోసా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావద్దని ఆపదలో ఉన్న వారు వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షం కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పి ఆదేశించారు. గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఉన్నందున కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ సందర్శించడానికి పర్యాటకులు, ప్రజలు రావద్దని ఎస్పి జె. సురేందర్ రెడ్డి కోరారు.
మారుమూల అటవీ ప్రాంతమైన పలిమెల మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన కనుకునూరు, మూకునూరుతో పాటు, వివిధ గుత్తి కోయ గూడేలను, లోతట్టు ప్రాంతాలను ఎస్పి స్వయంగా సందర్శించి, బాధితులకు పండ్లు, కొన్ని నిత్యావసర వస్తువులు అందజేశారు. అలాగే వరదలు మరియు వర్షాల దృష్ట్యా వరద ప్రభావిత ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పి సూచించారు. వరద బాధితులను ప్రభుత్వo ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.
పెరుగుతున్న వరద ఉదృతి దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా సంబంధిత శాఖల సహకారంతో అవసరమయిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దివాకర, కాటారం డిఎస్పీ బోనాల కిషన్, మహదేవ్ పూర్ సిఐ కిరణ్, కాటారం సిఐ రంజిత్ రావు, SI లు రాజ్ కుమార్, అరుణ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.