గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

– మౌలిక సదుపాయాల కల్పనకు వేలకోట్లు నిధులు విడుదల
– రాబోయే కాలంలో దేశంలోనే తెలంగాణ నెం.1గా నిలుస్తుంది
– రాష్ట్ర రవాణాశాఖా మంత్రి మహేందర్‌రెడ్డి
– వికారాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి
వికారాబాద్‌, జులై6(జ‌నం సాక్షి ) : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దీనిలో భాగంగా కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మంత్రి వికారాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సిద్ధులూరులో రూ. 56 లక్షలతో, పాతూర్‌లో రూ. 13 లక్షలతో పలు అభివృద్ధి పనులను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. పాతూర్‌ గ్రామాన్ని పూర్తిస్థాయి ఓడిఎఫ్‌గా తీర్చిదిద్దినందుకు గ్రామ సర్పంచ్‌ పార్వతమ్మ, వార్డు సభ్యులను మంత్రి సన్మానించారు. అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రావిూణ ప్రాంతాల వికాసం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని కేసీఆర్‌ భావిస్తున్నారని, దీనిలో భాగంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చి రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పక్కాప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. రైతుల అభ్యున్నతికోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, దీనిలో ఆగంగా రైతుబంధు, రైతుబీమా పథకాలతోప ఆటు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర, పంటల దిగుబడుల పెంచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి ఇతర రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని, కేసీఆర్‌ పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని అన్నారు. రావోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ ఓమర్‌ జలీల్‌, ఎమ్మెల్యే సంజీవరావు, టీఎస్‌ఈఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌ గౌడ్‌, జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.
————————-