గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న వెంకయ్య సతీమణి


కూతురు దీపాతో కలసి మొక్కలు నాటిన ఉష
బెంగళూరు,అగస్టు24(జనంసాక్షి):: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీపా వెంకట్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. బెంగుళూరు దేవనహళ్లిలోని సదహళ్లి గేట్‌ వద్ద మంగళవారం వీరు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధి సుధీర్‌ వృక్ష వేదం పుస్తకాన్ని వారికి బహుకరించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అద్భుత కార్యక్రమం అని ప్రతి ఒక్కరు పాల్గొని తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని ఆమె కోరారు. అడవులు, చెట్ల గొప్పతనాన్ని తెలియజేసేలా వృక్ష వేదం పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని స్వర్ణ భారతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని ఉపరాష్ట్రపతి కుమార్తె దీపావెంకట్‌ తెలిపారు.