చర్లపల్లి జైలుకు రేవంత్‌

4

హైదరాబాద్‌,జూన్‌ 2(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికికపోయి అరెస్టయిన రేవంత్‌ రెడ్డిని మంగళవారం అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయన్ను  చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 5వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను కోర్టు ఆదేశించారు.  కాగా రాజకీయంగా కుట్రచేసి రేవంత్‌ను ఇరికించారని ఆయన తరపున లాయర్లు అంటున్నారు. ఈ మేరకు పోలీసులు రేవంత్‌తోపాటు నిందితులైన ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌ను చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి తరలించారు. కాగా జైల్లో ఉన్న తెలంగాణ శాసనసభాపక్ష ఉపనాయకుడు రేవంత్‌రెడ్డిని మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టిడిపి నాయకులు పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్ర, తదితరులు కలిశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టిన కేసులో ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.