జనాభా సంఖ్యకు ఓటర్ల మధ్య.. దామాషాను లెక్కించండి
– బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయండి
– వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్
వరంగల్ అర్బన్, మార్చి4(జనంసాక్షి) : జనాభా సంఖ్యకు ఓటర్లుగా నమోదయిన వారికి మద్యవున్న దామాషాను ప్రయోగాత్మకంగా 100 పోలింగ్ కేంద్రాల్లో అధ్యయనం చేయించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్ లో ఎలక్టోరల్ రిజిస్టేష్రన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్టేష్రన్ ఆఫీసర్ లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. వరంగల్ వెస్ట్ లో 241పోలింగ్ కేంద్రాల్లో 30, వరంగల్ ఈస్ట్ లో ఉన్న 215 పోలింగ్ కేంద్రాల లో 30 పోలింగ్ కేంద్రాలు, వర్ధన్నపేట లో ఉన్న మొత్తం 268 పోలింగ్ కేంద్రాల్లో గ్రావిూణ మండలాలైన వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హాసన్ పర్తి లలో మండలానికి 10 పోలింగ్ కేంద్రాల్లో జనాభాకు ఓటర్లకు ఉన్న దామాషాను లెక్కించుటకు బూత్ లెవెల్ ఆఫీసర్లను ఇంటింటికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్ లకు మండలాల వారీగా అవగాహన కల్పించి, నిర్ణీత ప్రొఫార్మ ఇచ్చి సర్వేచేయించాలని తహశీల్దార్ లకు సూచించారు. వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ లలో అన్ని వర్గాల కుటుంబాలు అనుసంధానమయ్యే విదంగా స్లమ్ ఏరియా, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ జనాభా వుండే పోలింగ్ కేంద్రాలను 10చొప్పున ఎంపిక చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో జనాభాకు ఓటర్ల సంఖ్యకు 65గా ఉన్న సగటు దామాషా ఆయాప్రాంతాల భౌగోళిక, ఆర్థిక పరిస్థితులను బట్టి మారుతుందని తెలిపారు. ఉపాధి, విద్యకు జరిగే వలసలు వలన తేడాలు వస్తాయని చెప్పారు. అలాగే ఇండ్ల సంఖ్యకు అనుగుణంగా జనాభాను, ఓటర్ల సంఖ్యను అంచనావేయలేమని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోర్షన్లు, అంతస్తుల ను బట్టి జనాభాతో పాటు ఓటర్లు ఎక్కువగా ఉంటారని తెలిపారు. వేయి జనాభాకు ఉన్న ఓటర్ల వాస్తవ సంఖ్య సేకరించుటకు ఈ అధ్యయనం దోహదపడుతుందని చెప్పారు. అలాగే ఓటరు జాబితా శుద్దీకరణ లో భాగంగా డూప్లికేట్ ఓటర్లను తొలగించుటకు ఫారం-7తో ఏడురోజుల నోటీసు జారీచేయాలని చెప్పారు. లాజికల్ ఎర్రర్స్ సరిచేయాలన్నారు. డూప్లికేట్ ఫోటోఓటరు ఉంటే, సాధారణంగా ఆరు నెలలుగా నివాసం ఉంటున్న ఇంటిని పరిగణనలోకి తీసుకుని, ఇతర చోట జారీచేసిన కార్డును రద్దుచేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవికిరణ్ ,ఆర్డీవో కె వెంకారెడ్డి, ఎస్ డి సి. వైవి గణెళిష్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కిరణ్ ప్రకాశ్, 3 నియోజక వర్గాలకు చెందిన తహశీల్దార్ లు హాజరయ్యారు.