జర్నలిస్టులను కుక్కలతో పోల్చిన ప్రభాకరన్
అన్నాడిఎంకె ఐటి విభాగం కార్యదర్శిపై వేటు
చెన్నై,మే28(జనం సాక్షి ): జర్నలిస్టులను వీధి కుక్కలతో పోలుస్తూ ట్వీట్ చేసిన ఏఐఏడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి హరి ప్రభాకరన్పై ఆ పార్టీ వేటు వేసింది డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ఆస్పత్రిలోకి రిపోర్టర్లను అనుమతించరని..బిస్కెట్ల కోసం మొరిగే వీధికుక్కులను లోపలికి అనుమతించకుండా గేటుకు కట్టేయాలంటూ జర్నలిస్టులను ఉద్దేశించి ప్రభాకరన్ వివాదాస్పద ట్వీట్ చేశారు. కంప్యూటర్ ఇంజనీర్ అయిన ప్రభాకరన్ సోమవారం ఉదయం 9.40 గంటలకు ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని తొలగించారు.ట్వీట్లో తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ వ్యక్తిగతమైనవని, పార్టీకి సంబంధంలేదని, పార్టీ అభిప్రాయాలు వెల్లడించే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. తన ట్వీట్తో ఎవరి మనోభావాలు గాయపడినా క్షమించాలని కోరారు. తూత్తుకుడి నిరసనల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఓ పన్నీర్సెల్వం స్ధానిక ఆస్పత్రిని సందర్శించిన క్రమంలో ప్రభాకరన్ ట్వీట్ చేశారు. పన్నీర్ సెల్వం పర్యటన నేపథ్యంలో ఆస్పత్రి ప్రాంగణంలోకి విలేకరులను అనుమతించలేదు. తూత్తుకుడిలో స్టెరిలైట్ రాగి ప్లాంట్ను వ్యతిరేకిస్తూ జరిగిన హింసాత్మక నిరసనల్లో 13 మంది మరణించగా, పెద్దసంఖ్యలో నిరసనకారులకు గాయాలైన విషయం తెలిసిందే.