జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు

సర్వే కోసం కసరత్తు చేస్తున్న అధికారులు

మహిళా రైతులకు కూడా అవకాశం

ఖమ్మం,ఆగస్ట్‌30: భూసర్వేలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. గ్రామస్థాయిలో 372, మండల స్థాయిలో 21, జిల్లాస్థాయిలో 1 చొప్పున కమిటీ ఏర్పాటు కానుంది. ప్రతి కమిటీకి ఓ కోఆర్డినేటర్‌ను నామినేషన్‌ పద్ధతిలో ప్రభుత్వం ఎంపిక చేయనుంది. సాగులో ప్రావీణ్యం, అర్హతలను బట్టి కమిటీ సభ్యులుగా రైతులను ఎంపిక చేయనున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలకు ఇన్‌చార్జ్‌గా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరించనున్నారు. ప్రభుత్వ మర్గదర్శకాల మేరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 394 రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కానున్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక సమన్వయ సమితీ ఏర్పాటు చేయనున్నారు. అధికారుల సమా చారం ప్రకారంగా జిల్లాలో మొత్తం 372 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 21 మండల రైతు సమితులు, జిల్లా సమితితో కలిసి 394 రైతు సమితులు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మండల స్థాయిలో ఒక్కొక్కటి చొప్పున మరో 21 సమితులు, మండల, గ్రామ సమన్వయ సమితులను పర్యవేక్షించేందకు గాను జిల్లా స్థాయిలో మరో సమన్వయ సమితి ఏర్పాటు కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రైతు సమన్వయ కమిటీలలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నూతన కమిటీల రూపకల్పన జరగనుంది. సాగులో మంచి ప్రావీణ్యం కలిగిన, ఉత్సాహవంతులను ఎంపిక చేయనున్నారు. గ్రామములో నివాసం ఉంటూ, పట్టా భూమిలో సాగు చేసుకునే వారు అర్హులుగా గుర్తిస్తారు. అదే విధంగా ప్రతి గ్రామ కమిటీలో 4నుంచి 5 గురు మహిళా రైతులకు చోటు కల్పిస్తారు. సమతి కమిటీలలో అన్ని సామాజిక వర్గాలకు చోటు కలిగించే విధంగా రూపకల్పన చేయడం జరుగతుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల్లో ఒక్కో కోఆర్డినేటర్‌ను ప్రభుత్వమే నామినేషన్‌ పద్ధతిలో ఎంపిక చేయనుంది. గ్రామ స్థాయి కమిటీలలో మొత్తం 15 మంది, మండల స్థాయి కమిటీలలో 24 మంది, జిల్లా స్థాయి కమిటీలలో 24 మం ది, రాష్ట్రస్థాయి కమిటీలో 42 మంది చొప్పున సభ్యులు ఉంటారు.

సాగుకు అవసర మైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ భారీ ప్రోత్సాహాలను ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్‌ నిర్ణయం పట్ల జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది.