టిఆర్ఎస్లో నివురుగప్పిన నిప్పులా అసమ్మతి
హరీష్ రావు బయటకు రావడం ఖాయం
టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి సంచలన వ్యాఖ్యలు
వరంగల్,నవంబర్5(జనంసాక్షి): మొన్నటికి మొన్న గజ్వెల్లో కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేనే లేదు. ఇప్పుడు టిడిపి సీనియర్ నేత రేవూరు ప్రకాశ్ రెడ్డి మరో బాంబు పేల్చారు. టీఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం సాగుతోందని, ఎప్పటికైనా ఆ పార్టీ చీలిపోవడం ఖాయం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అగ్గి బద్దలవడం ఖాయమన్నారు. హరీష్ రావు అసలు సిసలైన నాయకుడు అని ఆయన పేర్కొన్నారు. ఆయన టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నారని అన్నారు. సోమవారం ఇక్కడ విూడియాతో మాట్లాడిన రేవూరి.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్-ప్రజాకూటమికి సమానంగా సీట్లు వస్తే.. అందులో కొంతమందిని తీసుకువచ్చి హరీష్ రావు సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్లో హరీష్ రావు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే.. హరీష్ రావు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండేవారని వ్యాఖ్యానించారు. హరీష్ను కేసీఆర్ నమ్మడం లేదని, ఈ కారణంగానే కేసీఆర్ పూర్తి అభద్రతాభావంతో ఉన్నాడని అన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడైన హరీష్ రావుని అవమానిస్తున్నా.. విధి లేక ఆ పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. కొడుకు, కూతురుకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. సరైన సమయం కోసం హరీష్ ఎదురు చూస్తున్నారని అన్నారు. హరీష్ తన నిజాయితీ, సిన్సియారిటీని నిరూపించుకునేందుకు టీడీపీపై విమర్శలు చేయడం సరికాదన్నారు.