టిఆర్ఎస్ గతాన్ని విస్మరించడం తగదు: డిసిసి
ఆదిలాబాద్,జూన్4(జనం సాక్షి): కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తున్న టిఆర్ఎస్ నేతలు తెలంగాణ ఎలా వచ్చిదో గుర్తు చేసుకోవాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్ర్ రెడ్డి అన్నారు. గతాన్ని మరచి మాట్లాడడం తగదన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే అన్న విషయం మరచిపోరాదని అన్నారు. ఆనాడు సోనియా సాహసోపేత నిర్ణయం తీసుకోకుంటే ఇవాళ అధికారంలో ఉండేవారా అని అన్నారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ సాధించిన ప్రగతి ఏమిలేదని ఆయన దుయ్యాబట్టారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయితే.. తెలంగాణ సెంటిమెంట్ను సొమ్ము చేసుకొని సీఎం పీఠంపై ఎక్కి అభివృద్ధిని పక్కనబెట్టి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని తెరాస ఎన్నికల్లో హావిూ ఇచ్చిందని, ఇప్పటివరకు కేవలం 12వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారన్నారు. విద్యాహక్కు చట్టాన్ని ఈ ఏడాదైనా అమలు చేయాలని సూచించారు. పైపులైన్లలో కవిూషన్ల కోసమే మిషన్ భగీరథ చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పథకంలో 62శాతంమంది ఎకరానికి పైగా భూములున్న రైతులేనని, చిన్న రైతులకు పథకం అంతగా మేలు చేకూర్చలేదని విమర్శించారు.