టెన్షన్ లేకుండా పెన్షన్లు

లక్షలాది మందికి “ఆసరా” అందిస్తున్న ఘనత కేసీఆర్ దే..
ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి
మేడిపల్లి – జనంసాక్షి
కేసీఆర్ లాంటి దమ్మున్న సీఎం దేశంలోనే ఎవరూ లేరని, లక్షలాది మందికి పెన్షన్లు అందిస్తున్న ఘనత ఆయనదేనని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడిపల్లి మండలం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మేయర్ జక్కా వెంకట్ రెడ్డి నేతృత్వంలో జరిగింది. మంత్రి మల్లారెడ్డి అతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్ కార్డు అందజేసి మాట్లాడారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలని ప్రజలు అనుకుంటున్నారని, మన దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని ఆయన అన్నారు. తెలంగాణ రాకముందు 22 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేవని, కేసీఆర్ ప్రభుత్వం దానిని 48 లక్షలకు పెంచిందని మంత్రి వివరించారు. అందరికీ విద్యా వైద్యం అందాలనే ఉద్దేశంతో బడ్జెట్ లో మెరుగైన కేటాయింపులు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు సుభాష్ నాయక్, యుగంధర్ రెడ్డి, అమర్ సింగ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.