డబుల్‌ బెడ్రూం ఇళ్లకంటే..  టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణమే ముఖ్యమా?


– మూడేళ్ల గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు
–  టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌
కరీంనగర్‌, అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణంలో చూపి శ్రద్ద, డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎందుకు చూపడం లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్‌ జిల్లాలోని చింతకుంటలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న డబుల్‌బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆరు మాసాల క్రితం ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ భవనాన్ని అన్ని హంగులతో పూర్తి చేశారని, కానీ మూడేళ్ల క్రితం చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం మాత్రం ఇంతవరకు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ భవనాన్ని శరవేగంతో పూర్తి చేసిన కాంట్రాక్టర్‌.. పేదల డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు ఇంతవరకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఓటమి ఎరుగని విజేత అని చెప్పుకునే మంత్రి గంగుల కమలాకర్‌, డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో 60వేల మంది డబుల్‌ బెడ్రూం ఇళ్లకు అర్హులు ఉంటే.. కేవలం 660 ఇళ్ల నిర్మాణం మాత్రమే చెపట్టారని ఆరోపించారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌, గ్రామాల వారిగా డబుల్‌ బెడ్రూం ఇళ్లకు అర్హులైన వారి జాబితా తయారు చేస్తుందని.. ఇళ్లు రాని వారంతా దరఖాస్తు చేసుకోవాలని పొన్నం కోరారు.