డిగ్రీ కళాశాలలో బ్యూటీషియన్ శిక్షణ పై అవగాహన కార్యక్రమం

పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 17 (జనం సాక్షి): మాతృశ్రీ ఫౌండేషన్ ఖమ్మం ఆధ్వర్యంలో మణుగూరు మండల ఇన్చార్జి పోతుగంటి సంధ్యారాణి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాస్ సమక్షంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థునిలకు కుట్టు మిషన్, బ్యూటీషియన్ శిక్షణ పై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థినులు విద్యా అవకాశాలతో పాటు స్వయం పోషణకు అవసరమైన అనేక విద్యలు నేర్చుకొనుట ద్వారా స్వయం ఉపాధితో పాటు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారని అన్నారు. మాతృశ్రీ ఫౌండేషన్ సభ్యులు పి. సంధ్యరాణి మాట్లాడుతూ ప్రతి మనిషి ఏదో ఒక రంగంలో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ఎంతో ఉంటుంది. బయట ఉద్యోగాలకు వెళ్లలేని మహిళలు స్వయంగా ఇంటి వద్ద సంపాదించుకునే సువర్ణ అవకాశం ఈ చేతివృత్తులకు ఉంటుంది. ఆర్థిక తోడ్పాటుతో పాటు మరి కొంతమందికి ఉపాధి కల్పించే దిశగా ఈ కోర్సులకు అవకాశం ఉంటుంది. ఆసక్తి గల విద్యార్థునులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి. శ్రీనివాస్ , అధ్యాపకులు, మాతృశ్రీ ఫౌండేషన్ సభ్యులు సంధ్యారాణి, అనుష, స్వప్న, సుధా ,మాధవి విద్యార్థునులు తదితరులు పాల్గొన్నారు.