తిరుపతి బాలుడి కిడ్నాప్‌ సుఖాంతం

మైసూరుకు చెందిన మహిళ కిడ్నాప్‌
తిరుపతి ఎస్పీ వెంకటప్పల నాయుడు
తిరుపతి,ఆగస్టు7(జనంసాక్షి): అలిపిరి లింక్‌ బస్టాండ్‌ స్టాండ్‌ వద్ద కిడ్నాప్‌నకు గురైన నాలుగు నెలల బాలున్ని పోలీసులు గుర్తించారు. తిరుపతి ఎస్పీ వెంకటప్పల నాయుడు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు వివరాలను ఎస్పీ విూడియాకు వివరించారు. రెండు రోజుల్లో పోలీసులు కేసును ఛేదించారన్నారు. మైసూరుకు చెందిన ఆశ అనే మహిళ బాబును కిడ్నాప్‌ చేసిందన్నారు. బాబును మైసూర్‌లో విక్రయించాలని చూసిందని.. అలిపిరి లింకు బస్టాండ్‌ వద్ద మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఈ ఘటనను గుర్తు చేసిందన్నారు. మొత్తానికి తిరుపతిలో 4 నెలల పసికందు అపహరణ కేసును అలిపిరి పోలీసులు పరిష్కరించారు. కిడ్నాప్‌ చేసిన యాచకురాలు ఆశని అరెస్టు చేశారు. ఈనెల 2వ తేదీన బాలాజీ బస్టాండ్‌ దగ్గర గంగులమ్మ తన నాలుగు నెలల మగబిడ్డను స్నానం చేసి వస్తా.. కొద్దిసేపు చూస్తుండు అని ఆశకు అప్పగించింది. స్నానం చేసి వచ్చిచూసేసరికి తన బిడ్డతో పాటు ఆశ కూడా కనిపించలేదు. అంతటా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారించిన
పోలీసులు నిందితురాలు ఆశ మైసూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆశను పట్టుకున్నారు. ఆ బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. కేసు ఛేదించేందుకు కృషి చేసిన అలిపిరి ఎస్‌ఐ జయచంద్ర, వారి టీంను ఎస్పీ అభినందించారు.