తెలంగాణను అడ్డుకున్న వారంతా కూటమి కట్టారు

జనగామ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన పార్టీలు ఇప్పుడు మహాకుటమి పేరుతో ఏర్పడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని జనగామ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అందుకే కాంగ్రెస్‌ నాయకులు గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే జనగామ నియోజక వర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హావిూ ఇచ్చారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. గోదావరి జలాలతో చెరువులు నింపుతానని హావిూ ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు పగటి వేషగాళ్లని, ప్రజలు వారి మాయ మాటలు నమ్మి మోసపొవొద్దని మాజీ ఎమ్మెల్యే అన్నారు. పలువురు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు.