తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం

బయోడిజైన్‌ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం
ప్రభుత్వంతో భాగస్వామ్యం.. శాటిలైట్‌ సెంటర్‌ పై ఆసక్తి
ముఖ్యమంత్రి లేఖను అందించిన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ బృందం
న్యూయార్క్‌(జనంసాక్షి): అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలోని స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీ, గూగుల్‌ ప్రధాన కార్యాలయం, జొయిటిస్‌ కంపెనీని సీఎం సందర్శించారు.విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్‌ కేర్‌ రంగాల్లో పరస్పర సహకారంపై స్టాన్‌ ఫోర్డ్‌ సెంటర్‌ ఫర్‌ బయోడిజైన్‌ సీనియర్‌ ప్రతినిధులతో రేవంత్‌ రెడ్డి బృందం చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ముందుకొచ్చింది. హెల్త్‌ కేర్‌ రంగంలో భాగస్వామ్యం, కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్‌ సైన్సెస్‌, స్కిల్‌ యూనివర్సిటీలకు మద్దతుతో పాటు.. రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేయాలని స్టాన్‌ ఫోర్డ్‌ బయోడిజైన్‌ అధికారులను రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై గూగుల్‌ ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో తమ కెపాబులిటీ సెంటర్‌ను సెప్టెంబరులో విస్తరించనున్నట్టు జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్‌ ప్రకటించింది. కొత్త ఆవిష్కరణల అభివృద్ధితో తెలంగాణ దేశంలో ముందు వరుసలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్‌ సైన్సెస్‌, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. సానుకూలంగా స్పందించిన స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రతినిధులు.. ప్రభుత్వానికి లేఖ సమర్పించారు. వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ.. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని స్టాన్‌ ఫోర్డ్‌ ప్రతినిధులు అనురాగ్‌ మైరాల్‌, జోష్‌ మేకొవర్‌ పేర్కొన్నారు. కొత్త సంస్కరణలతో తెలంగాణ భారత్‌లో ముందు వరుసలో ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి వారికి వివరించారు.స్టాన్‌ ఫోర్డ్‌ వంటి గ్లోబల్‌ లీడర్ల భాగస్వామ్యంతో హెల్త్‌ కేర్‌ రంగంలో అవసరమైన ఆధునిక నైపుణ్యం, పరిజ్ఞానాన్ని తెలంగాణ యువత అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, స్టాన్‌ ఫోర్డ్‌ భాగస్వామ్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌ కేర్‌ రంగానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణలో స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీ శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, సీఎస్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొన్నారు.