త్యాగాదనుల చరిత్రను స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేస్తాము.

ఐటీ మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.

రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 27. ( జనం సాక్షి) తెలంగాణ పోరాట యోధులు త్యాగదనుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలిసేలా ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుందని ఐటీ, మున్సిపల్ ,భారీ పరిశ్రమల మంగళవారం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి పురస్కరించుకుని
సిరిసిల్ల ప‌ట్ట‌ణంలో విద్యానగర్ బైపాస్ లో బాపూజీ జంక్షన్ లో కొత్త‌గా ఏర్పాటు చేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా బాపూజీకి ఘ‌న నివాళుల‌ర్పించారు.

 

అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ ఆచార్య‌ కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్య‌మం స‌హా అనేక పోరాటాలు చేశార‌ని కొనియాడారు. బాపూజీ పోరాటాలు మ‌రువ‌లేనివాని అన్నారు.స్వాతంత్ర్యం రాక ముందే కాదు వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలంగాణ ఉద్య‌మంలో బాపూజీ ముందంజ‌లో ఉన్నార‌ని గుర్తు చేశారు. ఉద్యమంలో తానూ పోరాటం చేయడమే కాదు పోరాట యోధులకు సహకారం అందించారని తెలిపారు. అప్పటి ప్రభుత్వం జ‌ల దృశ్యంలో తన ఇంటిని తీసి బయట‌ పడేశారో అక్కడే ప్రభుత్వం 20 అడుగుల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింద‌న్నారు. తెలంగాణ వైతాళికుల గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకే ప్రధాన కోడలు మహనీయుల విగ్ర‌హాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎవ్వరూ అడగకుండానే తెలంగాణలో కొత్త జిల్లాలకు, యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ వైతాళికుల పేరు పెట్టామ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ వైతాళికుల‌ను గౌర‌వించుకోవాల‌నే సంస్కారం ప్ర‌భుత్వానికి ఉంద‌న్నారు. సిరిసిల్లలో కొత్త చెరువు ట్యాంక్ బండ్, కొత్త జంక్షన్‌ల వద్ద రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ ఖర్చులతో మహనీయుల విగ్రహాలు పెట్టుకుందామ‌ని చెప్పారు. ప్రజల ఆశీస్సుల వ‌ల్లే ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందిస్తున్నాన‌ని పేర్కొన్నారు. మీ రుణం తీర్చుకునేందుకే శాశ్వ‌త స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చేస్తున్నాన‌ని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన అభివృద్ధి చాలదు. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. దశల వారీగా మరిన్ని అభివృద్ధి పనులు చేప‌డుతామ‌ని పేర్కొన్నారు.

వరంగల్‌లో 1250 ఎకరాలలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్ నిర్మాణం జరుగుతుంద‌ని కేటీఆర్ తెలిపారు. దీని ద్వారా 20 – 30 వేల మందికి ఉపాధి లభించనుంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సిరిసిల్ల లో నేతన్నల ఆత్మహత్యలను చూసి సీఎం కేసిఆర్ చలించి నేత‌న్న‌ల సంక్షేమం కోసం రూ. 50 లక్షలు విరాళాలు సేకరించి ఆర్థిక సహాయం అందజేశారనీ అన్నారు. నేతన్నలు కు భరోసా, ఆత్మస్థైర్యం కలిగించాలనే కాకుండా
అప్పటి ప్రభుత్వాలు కూడా స్పందించాలని సిఎం కోరుకున్నారని అన్నారు. కనికరం లేని అప్పటి ప్రభుత్వాలు స్పందించ లేదని గుర్తు చేశారు.స్వరాష్ట్రం లో నేతన్నల అభివృద్ధికి ఇచ్చే రూ. 70 కోట్ల బడ్జెట్‌ను రూ. 1200 కోట్లకు పెంచామ‌ని తెలిపారు. నేతన్న ల సంక్షేమం అభివృద్ధి నీ కాంక్షించి ఆపెరల్ పార్క్, వీవర్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేతన్నభీమా పథకం ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

కుల‌మ‌తాల‌కు అతీతంగా సీఎం కేసీఆర్ త‌న పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. అన్ని వ‌ర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్‌ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్‌
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ జీందం కళా చక్రపాణి, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.