త్వరలో పటాన్చెరుకు సీఎం కేసీఆర్

పటాన్చెరు మార్కెట్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మంత్రి తన్నీరు హరీష్ రావు
భారీ కాన్వాయ్ తో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే జీఎంఆర్, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు
పాశమైలారం పారిశ్రామికవాడ నుండి కర్ధనూర్ జంక్షన్ వరకు 121  కోట్ల రూపాయలతో నాలుగు వరుసల బీటీ రహదారి పనులకు శంకుస్థాపన
4 కోట్ల 50 లక్షల రూపాయలతో రుద్రారం సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో అభివృద్ధి పనుల శంకుస్థాపన
పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
సమిష్టి సహకారంతో పటాన్చెరు అభివృద్ధి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు సెప్టెంబర్ 10(జనం సాక్షి)
పటాన్చెరులో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.  పటాన్చెరుతో పాటు సంగారెడ్డిలో నిర్మించిన వైద్య కళాశాలను సైతం అదే రోజు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, పటాన్చెరులో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడ నుండి కర్ధనూరు ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 121 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు వరుసల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, రుద్రారం శ్రీ సిద్ధి గణపతి దేవాలయం ఆవరణలో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన మూడు రాజగోపురాలు, నిత్య అన్నదాన సత్రం, కళ్యాణ మండపం, 24 దుకాణాల సముదాయ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ
పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కు ఒక చరిత్ర ఉందని, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు.. వ్యవసాయ మార్కెట్ కోసం టిఎస్ఐఐసికి చెందిన 14 ఎకరాల విలువైన భూమిని కేటాయించాలని సానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరిన వెంటనే.. సాయంత్రం లోపు భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు, మలక్ పేట్
 ఉల్లిగడ్డ మార్కెట్ను ఇక్కడికి తరలించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన విజయకుమార్ మార్కెట్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పాశమైలారం పారిశ్రామిక వాడ పరిశ్రమలకు, కార్మికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో భాగంగా 121 కోట్ల రూపాయలతో ఓ ఆర్ ఆర్ జంక్షన్ వరకు నాలుగు వరసల బీటీ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా.. ఓ ఆర్ ఆర్ రహదారి గుండా అన్ని ప్రధాన నగరాలకు సులువుగా రవాణా చేయవచ్చని అన్నారు.రాష్ట్రంలోని పేరొందిన రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ది గణపతి దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.
సమిష్టి సహకారంతో పటాన్చెరు అభివృద్ధి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సమిష్టి సహకారంతో, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పటాన్చెరు నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోబోతున్నామని తెలిపారు.
భారీ కాన్వాయ్ తో ఘన స్వాగతం..
పటాన్చెరు మండలంలో పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్ తో ఘన స్వాగతం పలికాయి.
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా, పాశమైలారం,  రుద్రారం, ముత్తంగి మీదుగా పటాన్చెరు వరకు భారీ కాన్వాయ్ తో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, టి ఎస్ ఆర్ డి సి ఎండి మెట్టు శ్రీనివాస్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.