దేవాదుల నీటితో రెండోపంటకు సిద్దం
జనగామ,నవంబర్3(జనంసాక్షి): దేవాదుల నీటితో చెరువులు నింపడం వల్ల పాలకుర్తి, దేరుప్పుల మండలాల్లో సుమారు 2300 ఎకరాల ఆయకట్టు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పాలకుర్తిలో దేవాదుల ద్వారా గోదావరి నీళ్లతో చెరువులను నింపారు. జనగామ జిల్లాలో పాలకుర్తి కరువు ప్రాంతం కావడంతో ఇంతకాలం ఈ ప్రాంతంలో రైతాంగం నీళ్లు లేక అవస్థలు పడ్డారు. దేవాదుల రాకతో
ఈ ప్రాంత రైతాంగం రెండో పంట సాగుకు సిద్ధమవుతున్నారు. పాలకుర్తి మండలంలోని గూడూరు, ఈరవెన్ను, కొతులబాధ, లక్ష్మీనారాయణపురం, విస్నూరు, మైలారం, తీగారం, బమ్మెర, అయ్యంగారి పల్లి, శాతాపురం గ్రామాల చెరువులు కుంటలు నిండుకున్నాయి. దేవరుప్పుల మండలంలోని మాధపురం, ధర్మాపురం, కడవెండి, దేవరుప్పుల చేరువులు నిండాయి. నవాబుపేట రిజర్వాయర్ ద్వారా సింగరాజుపల్లి, నీర్మాల, రామరాజుపల్లి, చిన మడూరు పెద్ద మడూరు గ్రామాల చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. దీంతో భూ గర్భ జలాలు కూడా పెరిగాయి. ఇటీవలే రైతులతో కలిసి దేవరుప్పుల మండలంలో చెరువులు ,గోదావరి జలాల చేరికను ఎర్రబల్లి దయాకర్ రావు పరిశీలించారు.