ద్రోహంచేసిన బిజెపితో అంటకాగుతారా

వైసిపి ప్రభుత్వంపై శైలజానాథ్‌ మండిపాటు

విజయవాడ,జూలై7(జనంసాక్షి)): రాష్టాన్రికి ద్రోహం చేసిన బీజేపీకి సీఎం జగన్‌ మద్దతు ఇస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హావిూలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ధర్నాలో శైలజానాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డిమాండ్‌ చేశారు. 25 ఎంపీలు ఇస్తే హోదా తీసుకువస్తా అని చెప్పిన హావిూ ఏమైందని ప్రశ్నించారు. హోదా, విభజన హావిూలను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలందరినీ కలిసి హోదా విభజన హావిూలపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్టాన్రికి హోదా విభజన హావిూలను అమలు చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని శైలజానాథ్‌ అన్నారు.