ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ

అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి : భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం కలిసారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ద్రౌపది ముర్ముకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో ఆయన సమావేశం అయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్మును ప్రధాని మోడీ కలిశారు. ఎన్నికల్లో రాష్ట్రపతిగా విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీ ముద్దుబిడ్డ కొత్త చరిత్ర సృష్టించారంటూ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులు, వివిధ రాష్టాల్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముపై పోటీ చేసిన విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా కూడా అభినందనలు తెలియజేశారు. కానీ,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటి వరకూ కూడా ద్రౌపది ముర్ముకు కనీసం శుభాకాంక్షలు కూడా తెలియ జేయలేదు. సీఎం కేసీఆర్‌ తనయుడు, మంత్రి కేటీఆర్‌ ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం11: 57 నిమిషాలకు ట్వీట్‌ చేశారు. ’భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ముకు అభినందనలు. విూరు రాష్ట్రపతి అయ్యాక తాము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు, తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుదల బిల్లులు ఆమోదం పొందుతాయి’ అని ఆశిస్తున్నామంటూ ట్వీట్‌ చేశారు.