నూతన మెడికల్ కళాశాలలో తరగతుల నిర్వహణ కు ఏర్పాట్లు చేయాలి.

కలెక్టర్ పి.ఉదయ్ కుమార్.
మెడికల్ కళాశాల భవనాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్23(జనంసాక్షి):
ఈ విద్యా సంవత్సరం నుండి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ని నూతన మెడికల్ కళాశాల ప్రారంభమై తరగతులు ప్రారంభం కావలసి ఉన్నందున కళాశాలలో అన్ని రకాలైన మౌలిక సదుపాయాలతో సిద్ధం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.శుక్రవారం ఉదయం ఉయ్యాలవాడ లోని మెడికల్ కళాశాల నూతన భవనాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులను పరిశీలించి ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా అనేది పరిశీలించారు.ఈ సందర్భంగా  మెడికల్ కళాశాలలో ఇప్పటివరకు పూర్తి చేసిన తరగతి గదులు నిర్మాణము,  కార్యాలయ వసతులు, ల్యాబొరేటరీ, తదితర సదుపాయాలను పరిశీలించారు.విద్యార్థులకు కావలసిన వైద్య యాంత్రిక పరికరాలు, స్కానర్ లు ఇతరత్రా సదుపాయాలు ఎప్పటిలోగా వస్తాయని ప్రిన్సిపాల్ ను అడిగారు. స్పందించిన ప్రిన్సిపాల్ రమాదేవి  అన్ని సిద్ధంగా ఉన్నాయని, సివిల్ వర్క్ పూర్తి అయిన వెంటనే అవి బిగించడం ప్రారంభిస్తారని కలెక్టర్ కు సమాధానం ఇచ్చారు.అక్టోబర్ 15 నుండి కళాశాలలకు మెడికల్ విద్యార్థుల కేటాయింపు జరిగే అవకాశం ఉన్నందున ఆలోపల మెడికల్ కళాశాలలో అన్ని రకాల సదుపాయాలు పూర్తి కావాలని సూచించారు.వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి,డి.ఈ.ఓ గోవిందరాజులు, కళాశాల అధ్యాపకులు తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.