నేను మొండివాడ్ని

విమర్శలకు భయపడను : సీఎం కిరణ్‌కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) :
నేను మొండి వాడ్ని. విమర్శలకు భయపడను. ఎన్ని విమర్శలు చేస్తే అంతే మొండిగా ముందుకు వేళ్తా. ప్రజల కోసమే పనిచేస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వస్త్రాలపై వ్యాట్‌ మినహాయింపు నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్రానికి చెందిన వస్త్ర వ్యాపారులు శనివారం నగరంలోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ఆయనను ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వస్త్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ప్రజల సంక్షేమం కోసం వ్యాట్‌ నుంచి మినహాయింపునిచ్చినట్లు పేర్కొన్నారు. తనపై ఎన్ని విమర్శలు చేస్తే అంతే మొండిగా పనిచేస్తానని తెలిపారు. విమర్శలు వినీ.. వినీ.. మొండితనం పెరిగిపోయిందని, అది మొత్తం ప్రజల సంక్షేమ కోసం ఉపయోగిస్తున్నానని పేర్కొన్నారు. ఎక్కువ మంది ప్రజలపై భారం పడే నిర్ణయాలేవీ తీసుకోబోమని ఈ సందర్భంగా ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎళ్లవేళలా ప్రజల పక్షం వహిస్తుందని, వారి సంక్షేమం, అభివృద్ధిలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.