పర్యావరణ కాలుష్యంతో భవిష్యత్‌ తరాలకు ప్రమాదం

నెల్లికుదురు డిసెంబర్ 2 జనం సాక్షి:-పర్యావరణ కాలుష్యంతో భవిష్యత్ తరాలకు ప్రమాదమని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కవిరాజు తెలిపారు. శనివారం జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సంద‌ర్భంగా కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు కాలుష్యం దానివలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కవిరాజ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుందని,దీని వల్ల భవిష్యత్‌ తరాలు పెను ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. స‌క‌ల సృష్టికి జీవ‌నాధ‌ర‌మైన గాలి, నీరు, భూమిని క‌లుషితం చేస్తూ పోతే భ‌విష్యత్‌ అంధ‌కారం అవుతుంద‌ని పేర్కొన్నారు. కాలుష్యం వలన జరిగే నష్టాలపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కనిపించవలసిన అవసరం ఎంతో ఉందని తెలియజేశారు. అంతేకాకుండా అభివృద్ధి పేరుతో పర్యావరణానికి ముప్పు వాటిల్లే పనులు చేయొద్దని, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భావితరాలకు స్వచ్ఛమైన గాలి,నీరు, వృక్ష సంపద ఇవ్వగలమని తెలిపారు.ఢిల్లీ లాంటి ప్రధాన న‌గ‌రాలు వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయ‌ని,కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక వ్యూహాల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రత్వాలు దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పర్యావరణ నియంత్రణ , పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కే.రామ్మూర్తి, పి.వెంకటేశ్వర్లు, బి.నాగేశ్వరరావు, కె.సతీష్,డి.యాకన్న, కె.స్పందన అధ్యాపకేతర బృందం గౌరీ, లక్ష్మణ్,సైదా, ప్రదీప్,మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.