పాకిస్థాన్ కాల్పుల్లో
శ్రీనగర్ (జనం సాక్షి ): కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ పదే పదే ఉల్లంఘిస్తుంది. తాజాగా ఇవాళ ఉదయం జమ్మూకశ్మీర్లోని అక్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు.. భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులు జరిపారు. పాకిస్థాన్ కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ పాండే, ఏఎస్ఐ సత్య నారాయణ్ యాదవ్ మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. పాక్ రేంజర్లు కాల్పులు జరపడంతో.. సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల నివాసాలు ధ్వంసమవుతున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.